ఇలా ఐతే రాష్ట్ర వ్యాప్త బంద్ తప్పదు : మధు

పదో పిఆర్‌సి ప్రకారం రూ. 15,432 కనీస వేతనం చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు శుక్రవారంనుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. పలు జిల్లాల్లో విధుల బహిష్కరించి ర్యాలీలు, రాస్తా రోకోలు, ధర్నాలు తదితర రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. వివిధ రూపాల్లో వెల్లువెత్తిన వీరి ఆందోళనకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు పలకడం విశేషం. వెంటనే సమస్యలను పరిష్క రించకుంటే రాష్ట్రవ్యాప్త బంద్‌ తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. విజయవాడ నగర పాలక సంస్థ వద్ద మున్సిపల్‌ కార్మికుల జెఎసి ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వరకు మహాప్రదర్శన నిర్వహించారు. ఈ సమ్మెకు సిపిఎం, సిపిఐ మద్దతు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్‌ కార్మిక సంఘాల నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రభుత్వాన్ని హెచ్చ రించారు. గతంలో అనేకసార్లు కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలే దన్నారు. సమస్యలు పరిష్కరిం చడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, గత్యంతరం లేక కార్మికులు సమ్మెకు దిగారని తెలిపారు. రానున్న రోజుల్లో సమ్మె మరింత తీవ్రరూపం దాల్చకముందే దీనిని పరిష్కరించాలని సూచించారు. రాజకీయ పార్టీలన్నీ కార్మికుల కోసం తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీయాలని, కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతు తెలపాలని కోరారు. తమ పార్టీ తరపున కార్మికుల చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి ఓబులేస్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం దిగొచ్చేవరకు కార్మికులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, మున్సిపల్‌ కార్మికులకు కనీసం వేతనం చెల్లించేవరకు సమ్మె ఆపామని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి ఏ జిల్లాకు వెళ్లినా చీపుర్లతో స్వాగతం పలుకుతామన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్‌ బాబురావు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాధ్‌, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, మున్సిపల్‌ ఉద్యోగుల జెఎసి నాయకులు రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో మున్సిపల్‌ కార్మికులు విధులు బహిష్కరించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పాలకొండ మండలంలో నగర పంచాయతీ కార్యాలయం వద్ద సమ్మె శిబిరం ఏర్పాటు చేశారు. విజయనగరం గంట స్తంభం వద్ద రాస్తారోకో, పార్వతీపురం, బొబ్బిలిలో ర్యాలీ, సాలూరులో ధర్నా చేశారు. కార్మికుల ఆందోళనకు వైసిపి ఎమ్మెల్యే పి.రాజన్నదొర మద్దతు పలికారు. విశాఖ నగరంలోని అన్ని జోనల్‌ కార్యాలయాల ఎదుట పారిశుధ్య కార్మికులు నిరసనలు తెలిపారు. భీమిలి, గాజువాక, మల్కాపురం జోనల్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా నిరసన శిబిరం ఏర్పాటు చేశారు. సమ్మెకు వైసిపి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మండపేటలో ధర్నా నిర్వహిం చారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విధులు బహిష్కరించి, నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సమ్మె చేశారు. కార్యక్రమంలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు బి.తులసేంద్ర పాల్గొన్నారు. తణుకు మున్సిపల్‌ కార్యాలయం వద్ద జెఎసి ఆధ్వర్యంలో నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులు ధర్నాలు నిర్వహించారు. మచిలీపట్నంలోని సమ్మెకు మున్సిపల్‌ ఛైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్‌ సంఘీ భావం తెలిపారు. గుడివాడ, పెడన, నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, నూజివీడులో సిఐటియు, సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. గుంటూరు జిల్లాలోని పలు మున్సిపాల్టీల్లో కార్మికులు ధర్నాలు చేశారు. ప్రకాశం జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లోనూ, నగర పాలక కేంద్రంలోనూ సిఐటియు, ఎఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన సమ్మె జయప్రదంగా సాగింది. ఒంగోలులో ధర్నా, మార్కాపురం, చీరాల, కందు కూరులో ప్రదర్శనలు జరిగాయి. కనిగిరి కార్మికుల ధర్నాకు సిపిఎం, సిపిఐ, వైసిపి, కాంగ్రెస్‌ మద్దతు తెలిపాయి. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేటలో కార్మికులు ధర్నాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు వాహనాలను ఎక్కడికక్కడే నిలిపేసి విధులు బహిష్కరించారు. నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగిన సమ్మెనుద్దేశించి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ మాట్లాడారు. కడప జిల్లాలో కడప నగరపాలక సంస్థతో పాటు పలు మున్సిపాలిటీల్లో కార్మికులు ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కడప కార్పొరేషన్‌ ఎదుట కార్మికులు మహాధర్నా నిర్వహించారు. జమ్మల మడుగు ఛైరపర్సన్‌ తాటిరెడ్డి తులసి సమ్మెకు మద్దతు తెలిపారు. కర్నూలులో సిఐటియు, ఎఐటియుసి నాయకుల ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌తో చర్చలు జరిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కమిషనర్లకు వినతి పత్రాలు అందజేశారు. అనంతపురం జిల్లాలో ర్యాలీలు, మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు. వీరికి సిఐటియు, ఎఐటియుసి, వైఎస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు మద్దతు పలికారు.