కల్తీ విత్తనాల వలన నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని కోరుతూ...

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

విజయవాడ,

 తేది : 01 నవంబర్‌, 2023.

శ్రీయుత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

విషయం : 1) సాలూరు పట్టణంలో ఆటోనగర్‌ను అభివృద్ధి చేయాలని,

2) పాచిపెంట తదితర మండలాల్లో కల్తీ విత్తనాల వలన నష్టపోయిన రైతులకు  పరిహారం ఇప్పించాలని కోరుతూ...

అయ్యా!

ఈరోజు పార్వతీపురం జిల్లా ప్రజా రక్షణ భేరి సందర్భంగా వివిధ గ్రామాలు పట్టణాలు సందర్శించాము. అందులో భాగంగా సాలూరు పట్టణం, పాచిపెంట తదితర మండలాల్లో స్థానిక ప్రజలు అందించిన విజ్ఞప్తిని మీ దృష్టికి తీసుకువస్తున్నాను.

రాష్ట్రంలో సాలూరు పట్టణం రవాణాకు పెద్ద కేంద్రాలలో ఒకటి. 1000 లారీలు పైగా ఇక్కడ నుండి నడుస్తున్నాయి. రవాణాకు ట్రాన్సిట్‌ కేంద్రంగా ఉంది. వేలాది మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. వర్క్‌షాప్‌లు, రిపేర్‌షాప్‌ లు ఉన్నాయి. వీరందరి ఉపాధికి భద్రత కల్పించడానికి సాలూరు పట్టణంలో ఆటోనగర్‌ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కొంతకాలం క్రితం అందుకోసం భూమి కేటాయించినా ఇంతవరకు ప్రారంభించలేదు. కాబట్టి తక్షణం ఆటోనగర్‌ ప్రారంభించి ఉపాధికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

సాలూరు, పాచిపెంట తదితర మండలాల్లో ఖరీఫ్‌లో బేయర్స్‌ కావేరి కంపెనీలు సరఫరా చేసిన కల్తీ మొక్కజొన్న విత్తనాలతో 10 వేల ఎకరాల్లో పూర్తిగా పంట దెబ్బతిన్నది. కంకులు రాక రైతులు నష్టపోయారు. నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన కంపెనీలు అడ్రస్‌ లేకుండా పోయాయి. తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొని వ్యవసాయ శాఖ ద్వారా రెన్యుమరేషన్‌చేసి ఈ ప్రైవేట్‌ కంపెనీలపై చర్య తీసుకుని, రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని, రైతులకు కల్తీ విత్తనాలు అంటగట్టి మోసం చేసిన ఈ ప్రైవేట్‌ కంపెనీలపై చర్య తీసుకోవాలని కోరుతున్నాను.

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి