స్మార్ట్‌ సిటీ: ప్రజాస్వామ్యం శూన్యం

''స్మార్ట్‌ సిటీ'' ఇది అత్యంత ఆకర్షణీయమైన పేరు. భ్రమలకు వేదిక. ఆకాశాన్నంటే భవంతులు, విశాలమైన రోడ్లు, రయ్యిన దూసుకు వెళ్ళే కార్లు, మెట్రో రైళ్ళు, ఆఫీసులకు వెళ్ళకుండా ఇంట్లోకూర్చునే ఏ పనైనా సమకూర్చుకునే విధంగా పధ్ధతులు, అందమైన పార్కులు, నీటి ఫౌంటైన్లు, ఈత కొలనులూ, పచ్చటి చెట్లు, జిగేల్‌ మనే లైట్లు- 'వావ్‌' ఎంత అందమైన నగరం. ఇలాంటి నగరం కావాలని ఎవరికి మాత్రం ఉండదూ? ఇవన్నీ స్మార్ట్‌ సిటీలో ఉంటాయని చాలామంది భావిస్తున్నారు. నిజంగా ఇవన్నీ స్మార్ట్‌ సిటీలో ఉంటాయా లేక స్మార్ట్‌ సిటీ అన్న భ్రమలో మరేమైనా జరగబోతోందా? ఈ విషయాలను తెలుసుకోవాలంటే ప్రధాన మంత్రి 2015 జూన్‌ 25న విడుదలచేసిన స్మార్ట్‌ సిటీ మార్గదర్శకాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిందే. 
దేశంలో 100 నగరాలను స్మార్ట్‌ సిటీలుగా రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో 500 పట్టణాలను అమృత్‌ పథకం క్రింద అభివృద్ధి చేస్తామంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణాలో రెండు నగరాలను స్మార్ట్‌ సిటీలుగా ఎంపిక చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి నగరాలను, తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌ను స్మార్ట్‌ సిటీలుగా ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో చేరాలంటే ముందుగా ''స్మార్ట్‌ సిటీలో చేరటానికి ఆమోదిస్తున్నాం'' అని కౌన్సిల్‌ తీర్మానం చేయాలి. అలా తీర్మానం చేయమని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లనూ ఆదేశించింది. విజయవాడ నగరపాలక సంస్థ ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేసింది. ఈ పథకం 2015-16 నుంచి 2019-2020 వరకు అంటే ఐదేళ ్ళపాటు అమలులో ఉంటుంది.
అసలు స్మార్ట్‌ సిటీ అంటే ఏమిటీ? ఈ ప్రశ్నకు సర్వత్రా ఆమోదయోగ్యమైన నిర్వచనమేమీ లేదని, భిన్న ప్రజలకు భిన్న సౌకర్యాలు ఉంటాయని మార్గదర్శకాల ప్రారంభంలోనే పేర్కొన్నారు. అంటే నిర్దిష్టమైన నిర్వచనమేమీ లేదన్నమాట. అయితే 10 ముఖ్యమైన అంశాలుంటాయని ఆ మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అవి అవసరాలకు సరిపడా నీటిసరఫరా, నిరంతర విద్యుత్‌ సరఫరా, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంటుతో సహా పారిశుధ్యం, ప్రజారవాణాతో సహా సమర్థవంతమైన రవాణా సదుపాయాలు, భరించగలిగిన ధరలలో, ముఖ్యంగా పేదవారికి గృహ సదుపాయం, బలమైన ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, డిజిటలైజేషన్‌, సుపరిపాలన ముఖ్యంగా ఈ-గవర్నెన్స్‌- ప్రజల భాగస్వామ్యం, మంచి పర్యావరణం, పౌరులకు, ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు రక్షణ, విద్య, వైద్యం. వీటిని గమనిస్తే కొన్ని స్థానిక సంస్థలు చేసేవి, కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసేవి ఉన్నాయి. క్రొత్తగా ప్రతిపాదించిన సదుపాయాలేమీ లేవు. ఇవన్నీ ఇప్పటికే నగరాలలో ఎంతో కొంత మేర అమలు జరుగుతున్నాయి. కాకుంటే వాటిని మరింత పటిష్టంగా అమలు జరపటానికి చర్యలు తీసుకుంటామనేది వారి భావనగా పరిగణిద్దాం. వీటిని అమలు జరపటం కోసం కొన్ని స్మార్ట్‌ పరిష్కారాలను కూడా చూపించారు. ఉదాహరకు నీటి సరఫరాకు స్మార్ట్‌ నీటి మీటర్లు బిగించటం, లీకేజీలను అరికట్టడం, నీటి నాణ్యతను పరిశీలించటం, అలాగే పారిశుద్ధ్యం కోసం చెత్త నుంచి విద్యుత్‌ తయారీ, చెత్తను సేంద్రీయ ఎరువుగా మార్చటం, మరుగునీటిని శుద్ధి చేయటం వంటి స్మార్ట్‌ పరిష్కారాలను పేర్కొన్నారు. నిజానికి మార్గదర్శకాల్లో పేర్కొన్న ఈ స్మార్ట్‌ పరిష్కారాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు ప్రభుత్వాలు చెబుతున్న పాత పరిష్కారాలే తప్ప ప్రత్యేకించి క్రొత్త పరిష్కారాలేవీ లేవు.
అయితే క్రొత్త ఏమిటంటే ఈ పనులను చేయటానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయటం. ఇప్పటి వరకూ ఈ పనులను మున్సిపాలిటీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసేవి. ఇక మీదట ఈ పనులన్నీ కంపెనీ నిర్వహిస్తుంది. దీనిని మరింత లోతుగా పరిశీలిద్దాం. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో ఇచ్చిన పనులను అమలు జరపడం కోసం అందుకు ఎంపికైన ప్రతి నగరానికీ ఒక కంపెనీని ఏర్పాటు చేస్తారు. దీనికి స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ అని ముద్దు పేరు పెట్టారు. ఈ కంపెనీ 2013 కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటవుతుంది. దీనికి ఒక పూర్తికాలపు సిఇఒ ఉంటాడు. దీనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున, మున్సిపల్‌ కార్పొరేషన్‌ తరఫున కొంతమంది, వీటితో సంబంధంలేనివారు కొంతమంది డైరెక్టర్లుగా ఉంటారు. ఈ కంపెనీలో ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమాన వాటాలను (50:50) కలిగి ఉంటాయి. ఆ తరువాత ఆ కంపెనీ 40 శాతం వరకు షేర్లు అమ్మవచ్చు. అంటే ఆ కంపెనీని ప్రభుత్వం నెలకొల్పినప్పటికీ, షేర్లు కొనటం ద్వారా ప్రైవేటు సంస్థలు కంపెనీ యాజమాన్యంలోకి చేరతాయన్నమాట. ఈ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు నిర్వహణకు దేశ స్థాయిలో ఒక అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో ఎనిమిది మంది సభ్యులున్నారు. ఇందులో ప్రభుత్వాధికారులే తప్ప ఎన్నికైన ప్రజా ప్రతినిధులెవరూ ఉండరు. వీరు తమ సమావేశాలకు ఐక్యరాజ్యసమితి ప్రతినిధులను, ప్రపంచబ్యాంకు, టిఇఆర్‌ఐ సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌, బెంగళూరుకు చెందిన సెంటర్‌ ఫర్‌ స్మార్ట్‌ సిటీస్‌కు చెందిన ప్రతినిధులను ఆహ్వానించవచ్చు. అలాగే ద్వైపాక్షిక, బహుళ పక్ష ఒప్పందాలను కుదుర్చుకున్న వారి ప్రతినిధులను, పట్టణ ప్రణాళిక నిపుణులను పిలువవచ్చు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఎనిమిది మంది అధికారులతో కూడిన హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ ఉంటుంది.
ఇందుకోసం ఏర్పాటైన కంపెనీ స్మార్ట్‌సిటీలో జరిగే పనులను నిర్వహిస్తుంది. అయితే మున్సిపల్‌ కార్పొరేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ డిపార్టుమెంట్‌, రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టబద్ధమైన, నిర్ణయాలు చేసే కొన్ని అధికారాలు ఉన్నాయి. వీటికి చట్టబద్దమైన అధికారాలున్నంత కాలం కంపెనీ స్వేచ్ఛగా పని చేయలేదు. అందుకోసం స్మార్ట్‌ సిటీ మార్గదర్శకాలను అనుసరించి మున్సిపాలిటీ, మున్సిపల్‌ శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికున్న హక్కులన్నీ ఈ కంపెనీలకు బదలా యించాలన్నమాట. నగరపాలనకు సంబంధించి కౌన్సిల్‌, మున్సిపల్‌ డిపార్టుమెంటు, రాష్ట్ర ప్రభుత్వం తన హక్కులను పూర్తిగా కోల్పోతాయి. నగరంలో జరిగే ఈ పనులన్నింటికీ సంబంధించి ప్లానింగ్‌, మదింపు, ఆమోదం, నిధులు విడుదలచేయటం, అమలు జరపటం, నిర్వహించటం లాంటి సర్వాధికారాలూ ఈ కంపెనీకే ఉంటాయని స్పష్టం చేశారు.
మరి ఈ కంపెనీకి నిధులు ఎలా వస్తాయి? కేంద్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం రూ.194 కోట్లు, తరువాత మూడు సంవత్సరాలు రూ.98 కోట్ల చొప్పున ఇస్తుంది. అంటే మొత్తం నాలుగేళ్ళలో రూ.488 కోట్లు ఇస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, దానికి మ్యాచింగ్‌గా రాష్ట్ర ప్రభుత్వం, మున్సి పల్‌ కార్పొరేషన్‌ ఇచ్చేది ప్రాజెక్టు ఖర్చులో కొద్ది భాగం మాత్రమే నని గైడ్‌ లైన్స్‌లోనే స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే ఇది కంపెనీకి కార్పస్‌ ఫండ్‌ మాత్రమే. ప్రాజెక్టు ఖర్చును యూజర్‌ ఛార్జీలు, లబ్ధిదారుల ఛార్జీలు, ఇంపాక్టు ఫీజులు, భూ వినియోగం, అప్పులు చేయటం, లోన్లు, తదితర మార్గాల ద్వారా సమకూర్చుకోవాలి. 14వ ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు వచ్చే డబ్బును వాడుకోవాలి. మున్సిపల్‌ బాండ్లను విడుదలచేయటం, పన్నుల నిరంతర పెంపుదల వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా సమకూర్చుకోవాలి. అంటే స్మార్ట్‌ సిటీకి అయ్యే ఖర్చు మొత్తం వివిధ రూపాలలో ప్రజలు చెల్లించాల్సిందే. స్మార్ట్‌ సిటీని ఆమోదిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా నశిస్తుంది. నగరపాలన కంపెనీ పాలనగా మారు తుంది. నగరంలో జరిగే పనులకు అయ్యే ఖర్చును, కంపెనీలో వాటాదారుల లాభాలను పూర్తిగా నగర ప్రజలే భరించవలసి వస్తుంది. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. ఆ పన్నుల నుంచి నగరాల అభివృద్ధికి కచ్చితంగా వాటా ఇవ్వాలి. ఎందుకంటే స్థానికంగా జరిగే అభి వృద్ధి లేకుండా రాష్ట్రాభివృధ్ధి ఉండదు. కనుక స్థానిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా నిధులు ఇవ్వవలసిందే. నిజానికి రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సులలో పేర్కొన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం నుంచి 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు కేటాయిస్తే, స్మార్ట్‌ సిటీ పథకంతో సంబంధం లేకుండా ఆంధ్ర, తెలంగాణలలోని అన్ని పట్టణాలను, నగరాలను స్మార్ట్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ పథకంలో చేరితే ఇక మీదట నగరానికి రూపాయి రాదు. ప్రతి పనీ నగర ప్రజలు డబ్బులిచ్చి చేయించుకోవలసిందే. చివరకు నగర పాలనే అస్తవ్యప్తంగా మారుతుంది. నగర ప్రజలు ప్రజాతంత్ర హక్కులను కోల్పోతారు. కంపెనీల పాలన మొదలవుతుంది.
జాతీయ బ్యాంకులలో 2014 డిసెంబరు నాటికి ఉన్న మొండి బకాయిలు రూ.2,60,531 కోట్లు. ఇవన్నీ బడా బాబులు ఎగ్గొట్టినవే. వీటిలో 10వ వంతు వసూలు చేసినా దేశంలోని పట్టణాలన్నింటినీ స్మార్ట్‌గా మార్చవచ్చు. కార్పొరేట్‌ కంపెనీలకిస్తున్న లక్షలకోట్ల పన్ను రాయితీలను రద్దు చేయటం, బ్యాంకులకు బకాయిలున్న సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసి ఆడబ్బును బ్యాంకులకు జమ చేయటం, జీవిత బీమా సంస్థ, బ్యాంకులలో ఉన్న ప్రజల ధనాన్ని ప్రజల సౌకర్యాల కోసం వాడటంచేస్తే ప్రభుత్వం వద్ద నగరాల అభివృద్ధికి నిధులు సమకూరుతాయి. అప్పుడు స్మార్ట్‌ సిటీలు మాత్రమే కాదు గ్రామాలను కూడా స్మార్ట్‌ గా చేయవచ్చు. దేశమంతా సౌకర్యాలు కల్పించవచ్చు. 
ఏం కావాలన్నా స్మార్ట్‌ సిటీలో కంపెనీ దయాదాక్షిణ్యాల మీద ఆధార పడవలసిందే. స్మార్ట్‌ సిటీ గైడ్‌ లైన్స్‌లో ఇచ్చిన అంశాలన్నీ యథాతథంగా అమలు జరిగితే నగరం అత్యంత ఖరీదైనదిగా మారుతుంది. ఆ నగరంలో సామాన్యులకు బ్రతుకు ఉండదు. నిరంకుశత్వం నగరం మీద రాజ్య మేలుతుంది. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కాలపరిమితి ఐదేళ్ళు మాత్రమే. కానీ అది ఏర్పాటు చేసిన కంపెనీ, దాని పాలన శాశ్వతంగా కొనసాగుతుంది. అందుకే స్మార్ట్‌ సిటీ కంపెనీలకు, ధనవంతులకు స్మార్ట్‌. అత్యధికులైన సాధారణ ప్రజలకు నష్టం. ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. ఫెడరల్‌ వ్యవస్థకు విఘాతం.
- యంవి ఆంజనేయులు
(వ్యాసకర్త టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ)