
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలపైన, డబ్ల్యూటిఓ మంత్రుల సమావేశం ముందుకు తెస్తున్న వినాశకర విధానాలపైన సమర భేరి మోగిస్తూ బుధవారం నాడు భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ), అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్(ఎఐఎస్ఎఫ్), అలిండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్(ఎఐడిఎస్ఓ) సంఘాలు ఉమ్మడిగా ఆందోళన నిర్వహించాయి. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశాయి. విద్యా వ్యతిరేక విధానాలు నశించాలి, డబ్ల్యూటిఓ గో బ్యాక్, ఫెలోషిప్స్ అందరికీ ఇవ్వాలని ప్రదర్శకులు నినదించారు. ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు వి.శివదాసన్ మాట్లాడుతూ, డబ్ల్యూటిఓ మంత్రుల స్థాయి సమావేశంలో విద్యా రంగానికి సంబంధించి రూపొందించే విధానాలు చాలా ప్రమాదకరమైనవని అన్నారు. డబ్ల్యుటివో మంత్రుల స్థాయి సమావేశంలో ఇందుకు సంబంధించిన ఎలాంటి ఒప్పందంపైనా భారత్ సంతకం చేయరాదన్నారు.