భారత్‌కు వస్తే ప్రాణ హానే..

భారతదేశానికి తిరిగివస్తే తన ప్రాణాలకే తీవ్ర ముప్పు ఉంటుందని, అందుకే తను వెనక్కి వచ్చే ప్రసక్తే లేదని ఐపిఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ స్పష్టం చేశారు. టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో జరిగిన అవకతవకలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి తనకు ఇంతవరకు ఎలాంటి సమన్లు అందలేదని తెలిపారు. లలిత్‌మోదీపై దాఖలైన కేసు విషయంలో రెడ్ నోటీసును జారీచేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇంటర్‌పోల్‌ను కోరిన నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ముంబై కోర్టు కూడా ఇప్పటికే లలిత్‌మోదీపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీచేసింది. వీటన్నింటి నేపథ్యంలో మాట్లాడిన లలిత్‌మోదీ ‘నాకింతవరకు ఎలాంటి సమన్లు అందలేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తగిన రీతిలో ఎందుకు వ్యవహరించడం లేదు. చట్టప్రకారం ఈ ప్రక్రియను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు’ అని లలిత్ మోదీ ఇండియా టుడే న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో లలిత్‌మోదీ తెలిపారు