ప్రభుత్వానికి జలవనరుల వినియోగంలో చిత్తశుద్దిలేదని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. రాజమండ్రిలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన గతంలో జలయజ్ఞం పేరుతో వైఎస్ హాయంలో జరిగిన తప్పిదాన్ని ఎత్తిచూపారు. ఇప్పుడు కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటలో సాగుతున్నాయని ఆరోపించారు.ప్రజల మీద చిత్తశుద్ధి ఉండి, పోలవరం పూర్తిచేయాలనుకుంటే తొలుత రీ డిజైన్ చేయాలన్నారు. ఉన్న కొద్దిపాటి నిధులను వినియోగించి 120 అడుగుల మేర ప్రాజెక్ట్ పూర్తిచేయాలన్నారు. అప్పుడు నీటి వినియోగంలో లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. నిర్వాసితుల సమస్య కూడా రాదన్నారు. అందుకు భిన్నంగా నిధులు లేని సమయంలో 152 అడుగుల పేరుతో కాలయాపన చేయడం వల్ల వ్యయం పెరగడం ఖాయమన్నారు. నీటి వినియోగం కోసం కాకుండా కోట్లు మింగడానికి అలవాటు పడ్డ ప్రభుత్వాలు అందుకు సిద్ధం కావడం లేదని విమర్శించారు.