జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం

మీడియా, పత్రికా జర్నలి స్టులపైన భౌతిక, దూషణలతోకూడిన దాడులు పెరిగాయని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీిఐ) ఆందోళన వ్యక్తంచేస్తూ వీటిని శిక్షార్హమైన నేరంగా పరిగణించి శిక్షించటానికి వీలుగా చట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. జర్నలిస్టులపై జరిగే దాడులన్నింటినీ ప్రత్యేక కోర్టులకు సమర్పించి దర్యాప్తు చేయించాలని, చార్జిషీటు దాఖలు చేసిన సంవత్సరంలోపు విచారణ పూర్తిచేయాలని ప్రెస్‌ కౌన్సిల్‌ కోరింది. జర్నలిస్టుల రక్షణకు సంబంధించి ప్రెస్‌కౌన్సిల్‌ సబ్‌కమిటీ పలు సిఫార్సులు చేసింది. సిఫారసులను కౌన్సిల్‌ చైర్మన్‌, రిటైర్డ్‌ జడ్జి చంద్రమౌళికుమార్‌ ప్రసాద్‌ విలేకరులకు గురువారం వివరించారు. 

సిఫారసులు : జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, నేరాలకు అంతం పలికేందుకు నవంబర్‌ 3వ తేదీని జాతీయ దినంగా ప్రకటించాలి. ముద్రణా మీడియాకు సంబంధించే కాకుండా, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులపై జరిగేదాడుల వ్యవహారాలను కూడా విచారించాలని ప్రెస్‌కౌన్సిల్‌ కోరింది. యూపీలో జర్నలిస్టు జగేంద్రసింగ్‌ హత్యతో సహా ఇటీవల జర్నలిస్టులపై దాడులపై ప్రెస్‌కౌన్సిల్‌ ఆందోళన వ్యక్తంచేస్తూ పై నిర్ణయాలు చేసింది. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రెస్‌కౌన్సిల్‌ లేదా కోర్టు పర్యవేక్షణలో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్సు దర్యాప్తు చేయాలని, దర్యాప్తుకూడా నెలలోపు పూర్తికావాలని సబ్‌కమిటీ సిఫారసు చేసింది. జర్నలిస్టుల హత్యలు జరిగిన కేసులన్నింటినీ సీబీఐ దర్యాప్తుకు లేదా, జాతీయస్థాయి ఏజెన్సీద్వారా దర్యాప్తు మూడునెలలోపు పూర్తిచేయాలని కమిటీ సూచించింది. జర్నలిస్టులు లేదా ఎడిటర్‌పై కేసులను డీజీపీి ఆమోదంతోనే నమోదు చేయాలని కమిటీ కోరింది. ఈ కమిటీ కన్వీనర్‌గా కె అమర్‌నాథ్‌, సభ్యులుగా రాజీవ్‌ రంజన్‌నాథ్‌లతో సహా ఎనిమిదిమంది సభ్యులున్నారు. వీరు నివేదికను రూపొందించారు.జర్నలిస్టు హత్యకు గురైతే, వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పదిలక్షలు, తీవ్రంగా గాయపడితే 5లక్షలు ఇవ్వాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. ఈ కమిటీ రెండున్నర సంవత్సరాలపాటు పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించిన అనంతరం నివేదిక రూపొందించింది.