చంద్రబాబు ఫోన్ల కలకలం..

 రాష్ట్రంలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో టిడిపి అధినేత ,ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కొందరితోను ఫోన్‌లో మాట్లాడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ కాల్స్‌కు సంబంధించిన ట్రాన్స్‌స్క్రిప్ట్‌లను శాస్త్రీయంగా రూఢ చేసుకోవడానికి ఎసిబి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. దీంతో ఈ కేసు దర్యాప్తులో ఎసిబి మరో కీలక అడుగు వేసింది. చంద్రబాబునాయుడు, టిఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ల మధ్య సాగిన ఫోన్‌ సంభాషణకు సంబంధించిన ట్రాన్స్‌స్క్రీప్ట్‌ను ఎసిబి సిద్ధం చేసి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు శనివారం అందచేసింది. మొన్నటి వరకు ఈ కేసుకు సంబంధించి మే 28 నుంచి 31వ తేదీ వరకు తమకు అందిన ఫోన్‌కాల్స్‌ డేటాపై తాము ఇచ్చిన ట్రాన్స్‌స్క్రిప్ట్‌లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనే విషయమై ఫోరెన్సిక్‌ నిపుణుల నుంచి ఎసిబి అధికారులు నివేదికను తెప్పించుకున్నారు.