
దేశంలో సంచలనం రేపిన కోట్లాది రూపాయల బొగ్గు కుంభకోణంలో తొలి తీర్పు సోమవారం వెలువడింది. మోసం, నేరపూరిత కుట్రలకు గాను ఝార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ (జేఐపీఎల్) డైరెక్టర్లు ఆర్.సి. రుంగ్తా, ఆర్.ఎస్.రుంగ్తాలకు ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించింది. నిజాయతీ, నైతికతల్లేని ఇలాంటి వ్యాపారుల వల్ల భారత్ అభివృద్ధిలో వెనుకబడిపోతోందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రుంగ్తాలిద్దరికీ ప్రత్యేక సీబీఐ జడ్జి భరత్ పరాశర్ జైలుశిక్షతో పాటు రూ. 5 లక్షల వంతున జరిమానా విధించారు. జేఐపీఎల్ కంపెనీకి కూడా రూ. 25 లక్షల జరిమానా విధించారు. జరిమానా కట్టకపోతే మరో సంవత్సర కాలం జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు ఇచ్చారు.