కడప జిల్లా కొత్త మాధవరం చేనేత కుటుంబం ‘ఆత్మహత్య’పై సమగ్ర విచారణ జరిపాలి. అనంతపురం కలక్టరేట్‌ వద్ద జరిగిన దళిత గర్భిణి మహిళ ఆకలి చావు దురదృష్టకరం.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 25 మార్చి, 2024.

 

కడప జిల్లా కొత్త మాధవరం చేనేత కుటుంబం ‘ఆత్మహత్య’పై సమగ్ర విచారణ జరిపి, ఆత్మహత్యకు కారకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. తనది సంక్షేమ రాజ్యమని ప్రకటించుకుంటూ నవరత్నాల పేరుతో మోసం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పాలనకు చేనేత కుటుంబ ఆత్మహత్య, అనంతపురం కలక్టరేట్‌ వద్ద జరిగిన దళిత గర్భిణి మహిళ ఆకలి చావు సాక్షి భూతాలుగా ఉన్నాయి.

అనంతపురంలో ఆకలి చావు సంభవించి గర్భిణి మరణించటం అందరి హృదయాలను కలిచివేసింది. ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందకపోవడం శోచనీయం. అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మరణానికి బాధ్యత వహించాలి. 77 ఏళ్ళ స్వాతంత్య్రం అనంతరం కూడా ఆకలి చావుల సంభవించడం కేంద్ర రాష్ట్ర ప్రభాత్వాల వైఫల్యాన్ని ఎత్తి చూపుతుంది. ఆకలి చావుతో మరణించిన ఆమె పిల్లల బాధ్యతని ప్రభుత్వమే తీసుకోవాలి.

రెవెన్యూ రికార్డులలో పేరు మార్చిందెవరో తేల్చాలి. రాష్ట్ర రెవెన్యూ విభాగాలలో అవినీతి ఎంత హెచ్చు స్థాయిలో ఉందో దీన్నిబట్టి అర్ధమవుతుంది. వైసిపి నేతల భూదాహనికి తోడు అధికారుల అలసత్వానికి నిండు కుటుంబం బలైపోయింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం. ఎటువంటి అవినీతికి తావులేకుండా నేరుగా లబ్దిదారులకే పథకాలు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అవినీతి తారా స్థాయిలో ఉంది. నియోజకవర్గ వైసిపి నేతల అనుచరులు సుమారు 600 ఎకరాలపైగా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు తొలగించి అనర్హుల పేర్లను ఎక్కించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో చోటుచేసుకున్న వైసిపి నాయకుల దురాగతాలకు సర్కారే బాధ్యత వహించాలి. బాధిత కుటుంబానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో రూ.25లక్షలు చెల్లించి, తిరిగి వారి భూమిని స్వాధీనం చేయాలి.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి