ప్రభుత్వం పగులకొడుతోంది తాళాలు కాదు...అంగన్‌వాడీల గుండెలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ 

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 19 డిసెంబర్‌, 2023.

 

 

ప్రభుత్వం పగులకొడుతోంది
తాళాలు కాదు...అంగన్‌వాడీల గుండెలు

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం

చర్చించి వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచన

మహిళలతో పెట్టుకున్న ప్రభుత్వాలు గెలిచిన దాఖలా లేదు

విశాఖ స్లీటు ప్లాంటు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఎంపిలకు లేఖ

పోలవరం నిర్వాసితుల సమస్యనూ పరిష్కరించేలా చూడాలి

 

 

ప్రభుత్వం పగులకొడుతోంది అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు కాదని, కడుపు మండిన అంగన్‌వాడీ టీచర్లు, మినీవర్కర్లు, హెల్పర్ల గుండెలనని, వెంటనే సమస్యను పరిష్కరించకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, మంతెన సీతారాంతో కలిసి ఆయన మాట్లాడారు. 18వ తేదీన రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిందని, దీనికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, ఎం.ఏ.బేబీ హాజరయ్యారని తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడిరచారు. ముఖ్యంగా అంగన్‌వాడీల సమ్మెకు సిపిఎం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని పేర్కొన్నారు. తల్లులు, ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రజాతంత్రవాదులు వారి పోరాటానికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె చేపట్టి ఎనిమిది రోజులకు చేరిందని, సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణివల్లే రాష్ట్రంలో ఉన్న 55,605 అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయని, లక్ష మంది పైగా అంగన్‌వాడీ మహిళలు వీధుల్లోకి వచ్చారని తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరితో దాదాపు 32 లక్షల మంది పేదగర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలుకు ఆటా పాటా, ఆహారం, ఆరోగ్యం  దూరం చేస్తున్నారని విమర్శించారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని, అంగన్వాడీలకు కేంద్ర ప్రభుత్వం 2011 నుండి వేతనాలు పెంచలేదని, కనీసం రాష్ట్ర ప్రభుత్వమయినా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని కోరారు. వేతనం పెంపుకు డబ్బు లేదంటున్న ప్రభుత్వం విశాఖ గెస్ట్‌హౌస్‌కు రూ.450 కోట్లు ఎలా ఖర్చు పెడుతుందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు తదితర న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని ఎనిమిది రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వమే జటిలంచేసే చర్యలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఈ కాలంలో గ్యాస్‌, నిత్యావసర సరుకులు, కరెంటు ఛార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌ ఛార్జీలు విపరీతంగా పెరిగినా అంగన్‌వాడీల వేతనాలు పెరగలేదని తెలిపారు. 2019 ఎన్నికల సందర్భంగా తెలంగానా కన్నా వెయ్యి ఎక్కువ ఇస్తానని జగన్‌ వాగ్దానం చేశారని, మేనిఫెస్టోలో కూడా పెట్టారని, దాన్నే అమలు చేయమని అంగన్‌వాడీ యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయన్నారు.

నాలుగు సంవత్సరాలుగా పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని, ఇతర  సమస్యలు పరిష్కారం చేయాలని అనేకసార్లు ప్రభుత్వ అధికారులకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చి దశలవారీగా అనేక ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో ఏమాత్రమూ చలనం లేదని పేర్కొన్నారు. అనివార్యంగా డిసెంబర్‌ 12 నుండి రాష్ట్రంలో ఉన్న లక్ష మంది పైగా అంగన్‌వాడీలు తమ సెంటర్లను మూసేసి సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెంటనే అంగన్వాడీ యూనియన్ల నాయకులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని కోరారు. 

అంగన్‌వాడీలు దళిత, గిరిజన, బడుగు బలహీనవర్గాల పిల్లలకు సేవలు అందిస్తున్నారు. గర్భిణీ,  బాలింతలకు ఆహారంతో పాటు ఆరోగ్య సలహా సేవలూ అందిస్తున్నారని వివరించారు. వారు సమ్మెలోకి వెళ్లడంతో గ్రామాల్లో పేదలు పనులకు వెళ్లడానికి కూడా పిల్లలను చూసుకునే వాళ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. 

ఒకవైపు చర్చలకు ఆహ్వానిస్తూ రెండోవైపు ప్రభుత్వ అధికారులే అంగన్‌వాడీ సెంటర్ల  తాళాలు పగలగొడుతున్నారని విమర్శించారు. అర్ధరాత్రి అపరాత్రులు లేకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తూ అంగన్‌వాడీలను అవమానిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ సమ్మె విరమించకపోతే విధులకు గైర్హాజరైనట్లుగా భావించి కలెక్టర్‌ చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించడం,  అంగన్‌వాడీలకు ఒళ్లు బలిసి సమ్మెచేస్తున్నారని నోరు అదుపులేకుండా మాట్లాడిన బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు, అంగన్‌వాడీలు ఆందోళన చేస్తున్న టెంట్లు పీకేయడం వంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డ రైల్వేకోడూరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి చర్యలు పునరావృతమైతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

అక్క చెల్లెమ్మలంటూ సమస్య పరిష్కారం చేయకుండా ప్రభుత్వమే తాళాలు పగలగొట్టడం, ప్రభుత్వ జులుం ప్రదర్శించడం, అన్ని డిపార్టుమెంట్ల వాళ్లని రంగంలోకి దించడం వల్ల మిగిలిన పనులన్నీ ఆగిపోయే ప్రమాదం ఏర్పడిరదని తెలిపారు. ఒక శాఖ ఉద్యోగులకు వ్యతిరేకంగా మరో శాఖ వారిని ఉసిగొల్పడం దారుణమని చెప్పారు. మిగిలిన ప్రజలకు సేవలు అందించాల్సిన సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, డ్వాక్రా మహిళలు, పోలీస్‌ యంత్రాంగం మొత్తం అంగన్‌వాడీ సెంటర్ల చుట్టూతిప్పటం వలన పరిపాలన స్తంభించే ప్రమాదం ఏర్పడిరదని అన్నారు. అంగన్‌వాడీ సెంటర్లు తెరవద్దని మద్దతు తెలియజేసిన లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు కట్‌చేస్తాం, అమ్మఒడి, పెన్షన్‌ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించడాన్ని ఖండిరచారు. ఇప్పటికైనా బేషజాలంకు పోకుండా ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.  

విశాఖ బ్లాస్ట్‌ ఫర్నేస్‌`3పై ఎంపిలకు లేఖ

‘విశాఖ ఉక్కు ` ఆంధ్రుల హక్కు’ అంటూ 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయడానికి గత మూడేళ్లకు పైబడి కేంద్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని, దీన్ని అడ్డుకోవాలని రాష్ట్రానికి చెందిన ఎంపిలందరికీ లేఖ రాసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ప్రజల అండతో కార్మికులు పోరాడి ఇప్పటి వరకు నిలబెట్టారని తెలిపారు. కేంద్రం ఇప్పుడు ప్రయివేటుపరం చేయడానికి కొత్త మార్గాలు వెతుకుతోందని, ఉత్పత్తికి కీలకమైన బ్లాస్ట్‌ ఫర్నెస్‌`3 పని చేసేందకు సుమారు రూ.1,200 కోట్ల రూపాయల అవసరం ఉందని పేర్కొన్నారు. ఆ నిధులను మంజూరు చేయడమో లేక అప్పు తీసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడమో మాని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించాలని కుతంత్రాలు చేస్తోందని విమర్శించారు. జిందాల్‌ స్టీల్‌ యాజమాన్యంతో ఉన్నతాధికారులు గతవారంలో ఢల్లీిలో చర్చించినట్లు వచ్చిన వార్తలతో స్టీల్‌ప్లాంట్‌ కార్మికవర్గం తీవ్ర ఆందోళన చెందుతోందని వివరించారు. ఇప్పటికైనా బ్లాస్ట్‌ ఫర్నెస్‌`3 పనిచేయించేందుకు నిధులు కేటాయించాలని, నిర్వహణ బాధ్యత సెయిల్‌కు అప్పగించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వారికి విశాఖస్టీల్‌ ప్లాంట్‌లోనికి అనుమతించరాదని కోరారు. 

పోలవరం నిధులనూ రాబట్టాలి

పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంవల్ల లక్షలాది కుటుంబాలు ముఖ్యంగా అత్యధిక గిరిజన కుటుంబాలు నిర్వాసితులవుతున్నారని, వారికి చెల్లించాల్సిన నష్టపరిహారం, పునరావాస పునర్నిర్మాణ సౌకర్యాల కల్పన కోసం ఇంకా దాదాపు 33 వేల కోట్ల రూపాయలు సమకూర్చవలసి ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన నిధులను విడుదల చేయకుండా తాత్సారం చేస్తోందని తెలిపారు. ముంపు ప్రాంతాలు పేరిట ఆయా గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులను సైతం కల్పించడానికి ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయని చెప్పారు. చివరికి ఇటీవల సంభవించిన తుఫానువల్ల జరిగిన నష్టపరిహారాన్ని కూడా ఎన్యుమరేషన్‌ చేయలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలవరం నిర్వాసిత ప్రజానీకానికి చెల్లించవలసిన నష్టపరిహారం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్రయోజనాల కల్పనకు కావలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు పార్లమెంటు సభ్యులందరూ సమస్యను ఈ సెషన్‌లోనే లేవనెత్తి వారికి న్యాయం చేసేందుకు కృషి చేయాలని కోరారు.