అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి సమ్మెను ఆపించాలి - సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు )

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 14 డిసెంబర్‌, 2023.

 

అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

సమ్మెను ఆపించాలి -  సిపిఐ(యం) డిమాండ్‌

      

అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి  సమ్మెను విరమింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది. లేనియెడల తల్లి బిడ్డలకు ఎదురయ్యే సమస్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హెచ్చరిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ డిసెంబర్‌ 12 నుండి చేస్తున్న సమ్మెకు సిపిఐ(యం) సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది. ప్రభుత్వ విచ్చిన్న ఎత్తుగడలను ఎదుర్కొని కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా నిలబడాలని, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల తరగతుల ప్రజలు, ప్రజాతంత్ర వాదులు అంగన్‌వాడీలకు  సంఫీుభావంగా నిలబడాలని విజ్ఞప్తి చేసింది.

2019 ఎన్నికల్లో అంగన్‌వాడీలకు తెలంగాణా మీద వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని వాగ్ధానం చేసి, ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌ మాట తప్పారు. కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పెంచి, పెన్షన్‌ 50% అమలు చేయాలనే కనీస కోర్కెలు అమలు కోసం గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కార్మికులు దశలవారీగా అనేక రూపాలలో ఆందోళనల తరువాత విసిగి వేసారి చిట్ట చివరకు సమ్మెకు దిగారు. ఈ సమ్మెను నివారించే అవకాశం ఉన్నా ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. 

రాష్ట్రంలో అనేక చోట్ల  ప్రభుత్వ అధికారులు, సచివాలయ ఉద్యోగులు అంగన్‌వాడీల కేంద్రాల తాళాలు పగులగొట్టి చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకుంటున్నారు. కొంతమంది అధికార పార్టీ ఎమ్మేల్యేలు బాధ్యాతారహితంగా మాట్లాడుతున్నారు. అంగన్‌వాడీలపై నోరుపారేసుకున్న బొబ్బిలి ఎమ్మేల్యేపై చర్యలు తీసుకోవాలి. కొన్ని చోట్ల వైఎస్‌ఆర్‌ పార్టీ కార్యకర్తలు టెంట్లు పీకేస్తున్నారు. ఈ చట్ట విరుద్ధ చర్యలను పోలీసులు దగ్గరుండి జరిపిస్తున్నారు. ప్రశాంతంగా సాగుతున్న సమ్మెను శాంతి భద్రతల సమస్యగా మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. ఈ సమ్మెకు పోలీసులు, సచివాలయ ఉద్యోగులు దూరంగా ఉండాలని చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నాము. ప్రశాంతంగా జరిగే సమ్మెను అక్రమ పద్దతుల ద్వారా విచ్చిన్నం చేసే ప్రభుత్వ యత్నాలను సిపిఐ(యం) ఖండిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతతో అంగన్‌వాడీ కార్మికుల సమస్యల పరిష్కరించేందుకు చొరవచూపి సమ్మెను విరమింపజేయాలని కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి