నామమాత్రంగా కొద్ది పోస్టులకే నోటిఫికేషన్‌ ఇవ్వడం గురించి మరియు ఖాళీగా ఉన్న పోస్టులన్నీ ప్రకటించి భర్తీ చేయాలని కోరుతూ..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు )

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ .

విజయవాడ,

 తేది : 13 డిసెంబర్‌, 2023.

శ్రీయుత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

 

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

విషయం : నామమాత్రంగా కొద్ది పోస్టులకే నోటిఫికేషన్‌ ఇవ్వడం గురించి మరియు ఖాళీగా ఉన్న పోస్టులన్నీ ప్రకటించి భర్తీ చేయాలని కోరుతూ...

అయ్యా!

రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగులు గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్‌ I డ II ఉద్యోగార్దులు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎదురుచూసి వయసు మీరిపోయినవారు కూడా ఉన్నారు. వేలాది పోస్టులు ఖాళీలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డిసెంబర్‌ 7న గ్రూప్‌ II ` 897 పోస్టులకు, డిసెంంబర్‌ 8న గ్రూప్‌ I ` 81 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్లు చూసి లక్షలాది మంది నిరుద్యోగులు నిరాశ చెందారు.

మెగా డిఎస్సీ ప్రకటిస్తానని ఊరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ప్రకటించలేదు. రాష్ట్రంలో 18 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యాహక్కు చట్ట ప్రకారం 40 వేలు ఖాళీలున్నాయని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఇంకా వచ్చే సంవత్సరం 12 వేల మంది రిటైర్‌ అవుతారు. ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు నింపుతామని, మెగా డిఎస్సీ ప్రకటిస్తామని, గిరిజన యువతకు ప్రత్యేక డిఎస్సీ ప్రకటిస్తామని మీరిచ్చిన హామీ ఇంత వరకు నెరవేరలేదు. ఏజెన్సీ బాషా వలంటీర్లు నాలుగున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్నా వారిని రెగ్యులరైజ్‌ చేయలేదు.

పోలీసు ఉద్యోగాలు వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత సం॥ ఎస్‌.ఐ 411, కానిస్టేబుల్‌ 6100 పోస్టులకే నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఎస్‌.ఐ.పోస్టుల సెలక్షన్‌ అవకతవకల్లో కోర్టు కూడా జోక్యం చేసుకోవలసి వచ్చింది.

కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 2024 జాబ్‌ కేలండర్‌ ప్రకటించాలి. ఫిబ్రవరి నాటికి పోస్టులన్నీ భర్తీ అయ్యేట్లు టైమ్‌టేబుల్‌ ప్రకటించి భర్తీ చేయాలని కోరుతున్నాను.

డిమాండ్లు : 

(1) ఖాళీగా ఉన్న గ్రూప్‌ IడII  పోస్టులను ప్రకటించి, ఫిబ్రవరిలోగా భర్తీ చేయాలి. వయోపరిమితి అర్హతను 47 సంవత్సరాలకు పెంచాలి.

(2) మెగా డిఎస్సీ ప్రకటించి ఖాళీలున్న టీచర్‌ పోస్టులన్నీ భర్తీ చేయాలి.

(3) గిరిజన యువతకు ప్రత్యేక డిఎస్సీ ప్రకటించాలి.

(4) ఏజెన్సీ బాషా వలంటీర్లను రెగ్యులరైజ్‌ చేయాలి.

(5) పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేయాలి. 

(6) పైన పేర్కొన్న పోస్టులకు వెంటనే టైమ్‌టేబుల్‌ ప్రకటించి ఫిబ్రవరి 2024 లోగా భర్తీ చేయాలి.

(7) 2024 పూర్తిస్థాయి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలి.

(8) ప్రభుత్వ స్టడీ సర్కిల్స్‌ ద్వారా పేద విద్యార్ధులకు ఉచిత శిక్షణ ఇవ్వాలి.

అభివందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి