భాదితులకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి

వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పిట్టగోడ కూలి ఐదుగురు కార్మికులకు సోమవారం తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. సిపిఎం క్రిడా సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవి తదితరులు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కార్మికులను, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాబురావు మాట్లాడుతూ, సచివాలయంలో అనేక దుర్ఘటనలు జరుగతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈ సందర్భంగా బాధితులకు నష్టపరిహారమివ్వాలని, దీనికి బాధ్యతగా నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని, కార్మిక శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు.