బాక్సైట్‌పై కపటనాటకమాడుతున్న చంద్రబాబు..జి.వో.నెం. 97ను రద్దు చేయాలి. - సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం

ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ హాయాంలో విడుదలచేసిన జి.వో.నెం.289ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, ఎపిఎండిసికి 1212 హెక్టార్లు బాక్సైట్‌ తవ్వకాల అనుమతులకు సంబంధించిన జి.వో.నెం.97 రద్దుకు సమాదానం చెప్పకుండా దాటివేశారు. దీనిని సిపియం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గిరిజనుల మనోభావాలను తెలుసుకొని ముందుకు వెళ్తామన్న చంద్రబాబు గిరిజన సలహా మండలి ఏర్పాటుపై పెదవి విప్పలేదు. దీనిని బట్టి బాక్సైట్‌ తవ్వకాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం కపటనాటకాలాడుతుందని అర్ధమౌతుంది.

                చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా తన హాయంలో విడుదల చేసిన జి.వో.నెం.97ను, అన్‌రాక్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దుచేస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించాలని సిపియం పార్టీ డిమాండ్‌ చేస్తుంది. ఈ ఒప్పందాలను, జి.వో.నెం.97ను రద్దుచేయకుండా ఎన్ని మాట్లాడినా గిరిజనలు సహించరు. గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదు. బాక్సైట్‌ తవ్వకాలపై గిరిజనులు తమ మనోభావాలను అనేక రూపాల్లో తెలియజేశారు. అయినా ప్రభుత్వం గిరిజనుల మనోభావాలను తెలుసుకొని ముందుకు వెళ్తామనడం అంటే గిరిజనులను మోసం చేయడమే అవుతుంది. బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులతో మమేకమై ప్రత్యక్ష పోరాటాలు నిర్వహిస్తామని  సిపియం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.