పేదల పొట్టగొడుతున్న ప్రభుత్వం..

పేదల పొట్టగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. గురువారం కృష్ణాజిల్లా నాగాయలంకలో జరిగిన కోడూరు, నాగాయలంక మండలాల మత్స్యకారుల సదస్సులో ఆయన మాట్లాడారు. దశాబ్దాల తరబడి పేదలు సాగుచేసుకుంటున్న భూములను విదేశీ కంపెనీలకు దారాదత్తం చేసే పనిలో ముఖ్యమంత్రి నిమగమయ్యారని విమర్శించారు. లక్షలాది ఎకరాల భూమిని పేదల నుండి బలవంతంగా లాక్కుంటుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దివిసీమలోని 15 వేల మత్స్యకార కుటుంబాలకు చెందిన దాదాపు 20 వేల ఎకరాల భూమిని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఓవైపు పేదల భూములను లాక్కుంటూ మరోవైపు సముద్ర తీరాల్లో విదేశీ సంస్థలతో ఫ్యాక్టరీలు నిర్మించేందుకు ప్రయత్నిస్తూ జల కాలుష్యానికి ప్రభుత్వం కారణమవుతోందన్నారు. దీనివల్ల మత్స్య సంపద దెబ్బతిని మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందన్నారు. అభివృద్ధి పేరిట వ్యాపారం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి తొత్తుగా ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.