ఆంధ్రకు ఎయిర్ బస్ ప్లాంటు

ఆంధ్రప్రదేశ్ కు మరో ప్రముఖ పరిశ్రమ రానుంది. విమానాలను తయారు చేస్తున్న ప్రముఖ సంస్థ ఎయిర్ బస్ అనంతపురంలో విమానాల తయారీ పరిశ్రమల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం 49.18 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ, జీవో నం. 264ను జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని లేపాక్షి ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామ సమీపంలో స్థలం కేటాయించారు. ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున ఎయిర్ బస్ చెల్లించనుంది. కాగా, ఈ స్థలానికి ఆనుకొని ఉన్న మరో 150 ఎకరాల స్థలాన్ని కూడా ఎయిర్ బస్ కోరుతోందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వ అధీనంలోని భూమిని ఎయిర్ బస్ కు అప్పగించిన ఏపీ సర్కారు, మిగతా భూమిని సైతం అందించే దిశగా ఆలోచనలు చేస్తోంది.